Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు: “బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని ఆమె పేర్కొన్నారు.
కవిత మాట్లాడుతూ, తనపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడానికి “పెయిడ్ ఆర్టిస్టుల”ను ఉపయోగిస్తున్నారని, “ఇంటి ఆడబిడ్డ”పై ఇలా మాట్లాడించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. “నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లేటప్పుడే తాను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పానని గుర్తుచేశారు.
పార్టీలోని “లీకువీరుల”ను పట్టుకోమంటే “గ్రీకువీరులు దండెత్తారు” అంటూ కవిత చురకలంటించారు. తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు కేసీఆర్ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, “కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు?” అని కవిత ప్రశ్నించారు.
తనపై తప్పుడు వార్తలు వస్తున్నప్పుడు పార్టీ వాటిని ఎందుకు ఖండించలేదని, పార్టీ సోషల్ మీడియాలో తనను ఎందుకు టార్గెట్ చేశారని ఆమె నిలదీశారు. తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు నిరసనలు తెలపని పార్టీ, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేసిందని ఆమె ప్రశ్నించారు. “నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా” అని కవిత స్పష్టం చేశారు.
పార్టీ చేయాల్సిన పనులను తాను జాగృతి తరపున చేస్తున్నానని కవిత తెలిపారు. పార్టీలో “కోవర్టులు” ఉన్నప్పుడు వారిని ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని ఆమె కుండబద్దలు కొట్టారు.
కాంగ్రెస్ పార్టీ “మునిగిపోయే నావ” అని అభివర్ణించిన కవిత, కాంగ్రెస్తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని అన్నారు. తనకు, కేసీఆర్కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని, తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని ఆమె పేర్కొన్నారు. చివరిగా, తనను ఎంపీ ఎన్నికల్లో కావాలనే ఓడించారని కవిత సంచలన ఆరోపణ చేశారు.